mt_logo

తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణలు: హరీష్ రావు

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎక్స్ (ట్విటర్) వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.

కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది అని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు.

తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అని హరీష్ పేర్కొన్నారు.

విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ గారి హయాంలో రెప్పపాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్‌ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలనపై దృష్టి పెడితే మంచిది అని హితవు పలికారు.