గ్రామపంచాయితీలకే గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అవకాశమిచ్చి వాటికి నిధులు సమకూర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ‘గ్రామజ్యోతి’ అనే మరో వినూత్న పథకాన్ని ఆవిష్కరించారు. ఒక్కో గ్రామానికి కనీసం రూ. 2 కోట్ల నుండి రూ. 6 కోట్ల వరకు సమకూర్చడం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించే దిశగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 15న ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంబించనున్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే ఆయా గ్రామ పంచాయితీలు ఎవరికి వారే సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం అవసరాలు తీర్చాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు తయారై వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం కన్నా ఎవరి అవసరాలకు తగ్గట్లు వారే ప్రణాళికలు తయారు చేసుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసుకోవడం ఉత్తమమైన మార్గమని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా మన ఊరు-మన ప్రణాళిక వంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల గ్రామజ్యోతికి తగిన ఆధారం లభించినట్లయ్యిందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.