mt_logo

సిరిసిల్లలో ఎఫ్‌జీవీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ.. వేలాది మందికి ఉపాధి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ ఫామ్‌ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. దీంతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ కి సుప్రసిద్ధమైన మలేషియా దేశంలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాలపైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని కేటీఆర్ ను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా తన నియోజకవర్గం సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్నామని తెలిపారు. ఎఫ్‌జీవీ కంపెనీ ఆహ్వానం మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటించి, ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. సిరిసిల్లతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ యాజమాన్యాన్ని కేటీఆర్ అభినందించారు. ఈ ఫ్యాక్టరీతో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *