సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన ఊరు – మన బడి పథకాన్ని అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మన ఊరు – మన బడి పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. మన ఊరు – మన బడి పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశ పెడతామని, అలాగే అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో మన ఊరు – మన బడి పేరుతో, పట్టణాల్లో మన బస్తీ – మన బడి పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద 12 అంశాలను చేపట్టడం జరిగిందని వివరించారు. నీటి సరఫరా, టాయిలెట్లు, విద్యుత్ సమస్యలు, తాగునీటి సమస్యలు, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్ చార్ట్ బోర్డులు, కంపౌండ్ వాల్స్, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాసులతో పాటు తదితర అంశాలను ప్రతిపాదించామన్నారు. మన ఊరు – మన బడి పథకాన్ని మూడు దశల్లో చేపడతామని, ఇందుకోసం రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు, అవసరమైన చోట డిజిటల్ క్లాసులు కూడా ప్రారంభిస్తామని అన్నారు.

