మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై ఈసీ నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ..రాజగోపాల్రెడ్డి, ఆయన కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై సోమవారం సమాధానం చెప్పాలని నోటీసులు జారీచేసింది. సోమవారం సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని, లేకుంటే తగిన నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేసింది. కాగా సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన 23 ఖాతాలకు ఈనెల 14,18,29 తేదీల్లో నగదు బదిలీ చేసినట్టు శనివారం ఆధారాలతో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
