mt_logo

హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని గవర్నర్‌కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ విజ్ఞప్తి

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ స్వాగతించారు. మన చట్టాలలో న్యాయం, సమానత్వంకు అద్దం పట్టిన ఈ తీర్పు భారత రాజ్యాంగ  ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని హైకోర్టు తీర్పును వెలువరించిన అనంతరం డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

ఈ తీర్పును దృష్టిలో ఉంచుకుని, ప్రజా జీవితంలో అంకితభావంతో పోరాటం చేసిన వారి సేవలను గుర్తించాలని బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. సమాజానికి మేలు చేయాలనేది మా సంకల్పం.. సమాజానికి తోడ్పాటు అందించాలనేది మా ప్రయత్నం అని దాసోజు అన్నారు.

అంతేకాకుండా, తమ నేపథ్యాలు, జీవితకాల కృషి, సామాజిక సేవ, కళ, సాహిత్య రంగాలకు అందించిన సేవలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు సరిగ్గా సరిపోతాయని తెలియజేశారు.  మేము సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుండి వచ్చాము. మా నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు శాసనసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు చాలా అరుదు, ఈ సందర్భం మరింత ముఖ్యమైనది అని వారు పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పుతో పాటు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్న మా అర్హతలను దృష్టిలో ఉంచుకుని, జూలై 2023లో మంత్రి మండలి చేసిన నామినేషను అమలు కోసం మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ గవర్నర్‌ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని వారు కోరారు.

చట్టసభలకు గౌరవం తెచ్చే విధంగా తమ వంతు పాత్ర పోషిస్తామని, సమాజానికి, పేద వర్గాలకు, దేశానికి మరింత ఉత్సాహంతో సేవ చేసే  అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.