mt_logo

దండయాత్ర.. దాడి.. గుండెగాయం

By: అల్లం నారాయణ

‘కమాండర్ షుడ్ నాట్ బీ ఎ కానిస్పిరేటర్’ అన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ. దళాధిపతి కుట్రదారు అయితే ఎట్లా ఉంటుందో? రుచి చూసింది ఇవ్వాళ హైదరాబాద్. తెలంగాణ మరోసారి గాయపడింది. దుఃఖపడింది. నిస్సహాయతలోంచే పెనుకేకలు పెట్టింది. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికీ నమ్ముకున్నది. ఆధిపత్యం మీద ఆత్మగౌరవానిదే అంతిమ విజయమని సంయమనంగా ఉన్నది. కానీ ఒక్క డాక్టర్ మిత్రా మాటలు చాలు. హైదరాబాద్ భవిష్యత్తులో ఏమి కాబోతున్నదో చెప్పటానికి. పుచ్చలపల్లి సుందరయ్య కుటుంబ వారసుడు ‘మేం హైదరాబాద్‌లో ముప్ఫై లక్షలమందిని ఉన్నం. చూసుకుంటం’ అని నిండు సభావేదిక నుంచి ప్రకటించి ఉన్నాడు.

ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనిపించలేదు పోలీసులకి. ఎందుకంటే పోలీసులూ చీలిపోయారు. వారి దళాధిపతి మీద సుప్రీంకోర్టులో కేసు నడపమని నిన్ననే తీర్పు చెప్పింది. ఇది కాకతాళీయం కాదు. ఆ మాటకొస్తే కలిసుంటారా! ఛస్తారా! అని పిట్టకథలు చెప్పిన అశోక్‌బాబుదీ అదే చరిత్ర. దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్ కొట్టి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణను హెచ్చరిస్తున్నాడు. ఏపీఎన్జీవో కార్యదర్శిదీ అదే చరిత్ర. చంద్రశేఖర్‌రెడ్డి నామధేయం గల ఆయన అంతవేదిక మీద ప్రసంగిస్తున్నా పోలీసులకు మాత్రం కనబడలేదు. హైదరాబాద్‌ను ఛిన్నాభిన్నం చేయ్యడానికి ఇవ్వాళ ఒక దండయాత్ర జరిగింది. కలిసుంటారా! ఛస్తారా! అని ఆ ఆధునిక ఔరంగ జేబులు అంటున్నారు. దాడులూ చేస్తున్నారు. చరిత్రను కేవలం ఘటనల సమాహారంగా కాకుండా ఒక తాత్విక, భౌతిక వారసత్వంగా స్వీకరిస్తే చాలా సత్యాలు బోధపడతాయి. చీలిపోయి ఉన్నాం కనుకనో, విడిపోయి ఉన్నాం కనుకనో కాదు. సత్యం కూడా అదే.

1672 నుంచి 1687 దాకా పాలించిన కుతుబ్‌షాహీ అబుల్ హసన్ తానీ షా రాజ్యంపై 1685లో ఔరంగజేబు దాడి చేశాడు. సరిగ్గా ఇవ్వాల్టి ఫతేమైదాన్, ఇవ్వాళ్ల సీమాంధ్ర దురంహంకార, ఆధిపత్య సభ జరిగిన మైదానంలో అలనాడు ఔరంగజేబు సేనలువిడిది చేశాయి. అనంతరం గోల్కొండపై దండయాత్ర జరిగింది. సేనానుల నమ్మక ద్రోహంతో గోల్కొండ కోట ఓడిపోయి తానీషా మొగలులతో సంధి చేసుకున్నాడు. ఆ సంధి తర్వాత ఔరంగజేబు సేనలు అక్కన్న, మాదన్నలను హత్య చేశాయి. సరిగ్గా ఇప్పటి కాలంలో దోపిడీ స్వభావం, ఆధిపత్య స్వభావం, కుట్రల స్వభావం, తడిగుడ్డతో గొంతులు కోసిన వాళ్లలాగానే ఆనాడూ ఆ కుట్రలకూ పాల్పడ్డాడు ఔరంగజేబు. సరిగ్గా ఇన్నేళ్లకి ఔరంగజేబు వారసులు ఫతేమైదాన్‌లో విడిది చేసి హైదరాబాద్‌ను కొల్లగొట్టే కుట్రలు లేపారు.

ఔరంగజేబు పాలన దక్కనీ సామ్రాజ్యాల్లో పిండారీల పాలన. దేవాలయాలను ధ్వంసం చేసిన పాలన. కానీ ఔరంగజేబు కాలంలో నిర్మించిన రాచబాట (దండుబాట)ద్వారానే ఇవ్వాళ్ల ఆధునిక ‘పిండారీ’లు హైదరాబాద్‌కు వచ్చారు. బందరు దాకా ఉన్న ఆ మార్గంలో ఇప్పటికీ ఉన్న గుమ్మటాలు, మసీదులు, విశ్రాంతి భవనాలు దాటుకొని వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే ప్రైవేట్ పెట్టుబడి తెగ బలిసిన ప్రైవేట్ ఏసీ బస్సుల్లో వాళ్లొచ్చారు. ముందు వెనకల పోలీసు వాహనాల రక్షణలో వాళ్లొచ్చారు. ‘కమాండర్’ కల్పించిన పూర్తి భద్రతలో వాళ్లొచ్చారు. దండయాత్ర జరిగింది. సరిగ్గా మూడువందల ఏళ్ల తర్వాత.

ముందువాళ్లు నిజామ్ కాలేజీ ముందు హైదరాబాద్ సంస్కృతిని దెబ్బతీశారు. శాంతిని దెబ్బతీశారు. దూదిమెట్ల బాలరాజుయాదవ్. విద్యార్థి నాయకుడు. ఎప్పుడూ టీవీల్లో కనిపించే ముఖం. తెలంగాణ విద్యార్థి జేఏసీ అధికారవూపతినిధి. సౌమ్యుడు. తెలంగాణ కోసం తండ్లాడే వాడు. ఊరికి ఆదర్శంగా నిలిచేవాడు. బాలరాజు మీద దాడి చేశారు. పదిమంది చుట్టూమూగి స్పృహ కోల్పోయేటట్టు కొట్టారు. వై.ఎస్.ఆర్.సీపీ షర్మిలమ్మ పార్టీ నాయకుడు దాడి చేశాడు. షర్మిలమ్మ హైదరాబాద్ పాకిస్తాన్ అవుతుందన్నారు. కానీ; ఆమె పార్టీ వాడు హైదరాబాద్ శాంతిని భంగపరచాలని వచ్చే కసబ్‌లాగా వ్యవహరించాడు. ఒక ‘కమాండర్ కానిస్పిరేటర్’ హయాంలో మరో డీజీపీ పోలీసులకు, వీధిలో వీరంగమేసిన వాళ్లూ కనపడలేదు. పీక కోస్తానని హెచ్చరిస్తూ ఊరేగిన పిండారీ కనపడలేదు. నల్లజెండాలు ఎగరేసి, తమ కాలేజీలో తాము, తమ హద్దుల్లో తాము, తమ మానాన తాము ఉన్న నిజామ్ కాలేజీ విద్యార్థుల మీద ఖాకీ మూకలు దాడి చేశాయి. విద్యార్థుల నెత్తురొలికింది. కాలేజీలోకి ఎట్లా వస్తారన్న ప్రిన్సిపాల్ ఘోష, అరణ్యరోదన అయింది. ఇది హైదరాబాద్‌లో ప్రజాస్వామ్యం. ఇది ఆంధ్రవూపదేశ్‌లో సమైక్యవాదుల ప్రజాస్వామ్యం. ఇది ‘కానిస్పిరేటర్ కమాండర్’ మార్కు ప్రజాస్వామ్యం. నిజమే భావ ప్రకటన స్వేచ్ఛ గురించీ, ప్రజాస్వామ్యం గురించీ చర్చ జరగాల్సే ఉన్నది.

పదహారు సంవత్సరాలు తెలంగాణ సుదీర్ఘంగా పోరాడింది. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నది. కాలాన్ని నమ్ముకున్నది. శాంతిని నమ్ముకున్నది. రాజ్యాంగస్ఫూర్తిని నమ్ముకున్నది. అబద్ధాలకు మేనమామలైనా, పెట్టుబడి విష సంతానం అయినా, తెలంగాణ అన్ని పార్టీలనూ నమ్మింది. నమ్మినానబోస్తే పుచ్చి బుర్రలయినయి. ప్రతిసారీ తెలంగాణ కోసమే అన్నవాడు డిసెంబర్ 9 తర్వా త, జూలై 30 తర్వాతా ఒకే భాష మాట్లాడాడు. ప్రతి రాజకీయవేత్తా రెండుగా చీలిన నాల్కలయ్యాడు. పాము కోరల్లా రెండు విషాలు చిమ్మాడు. ఓట్ల కోసం తెలంగాణ, ఓట్లు దాటినాక సమైక్యాంధ్ర. ఇక ప్రజాస్వామ్యం గురించీ మాట్లాడుకోవాలి.

ఇచ్చిన తెలంగాణను, వచ్చిన తెలంగాణను, పదహారేళ్ల పోరాట ఫలాన్ని, వెయ్యిమంది బలిదానాల, త్యాగాల ఫలితాన్ని ప్రజాస్వామ్య ఆకాంక్ష గెలుపును భంగపరిచి వాళ్లు ప్రజాస్వామ్యం కోరుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛల గొంతునొక్కి, భౌతికంగా తలెత్తిన ప్రతి తెలంగాణవాడి గొంతునొక్కి వాళ్లు భావ ప్రకటనా స్వేచ్ఛ కోరారు. చివరికి డాక్టర్ మిత్రా ‘యూ టూ బ్రూటస్’ గా తేలాడు. ఎందుకంటే ప్రజారాజ్యంలో ‘సామాజిక తెలంగాణ’ ప్రణాళికలు తయారు చేసిన మిత్రా ఇవ్వాళ్ల ముప్ఫై లక్షలమందిని చూపి, మందబలాన్ని హెచ్చరిస్తున్నారు. అశోక్‌బాబు అంతకుముందే అని ఉన్నారు. ‘ఆత్మహత్యలు జరగవు. హత్యలే ’ అని.. ఇది ప్రజాస్వామ్యం. కుక్కినపేనుల్లా ఉంటే సరేసరి. లేదంటే ఒక బాలరాజు, ఒక కానిస్టేబుల్ శ్రీనివాస్, ఒక కానిస్టేబుల్ శ్రీశైలం, ఒక శంకర్ ఎవడైతేనేం? తెలంగాణ జర్నలిస్టులు క్రాంతి, యుగంధర్ కలిసి ఉంటారా? ఛస్తారా?

కానీ, కానీ కుట్రదారులారా! చరిత్రను మళ్లీ గుర్తుచేస్తున్నా. మీరొకటి మరిచారు. తెలంగాణలో మొగలాయిలను మట్టికరిపించడానికి సర్వాయి పాపన్న తెలంగాణలో పుట్టాడు. ‘కల్లు గీసుకుంటే పైసలొస్తయి. యుద్ధం చేస్తే గోల్కొం డ కోట వస్తది’ అని విప్లవించిన వీరుడు పుట్టిన గడ్డ ఇది. మరిచిపోవద్దు.మీ చీకటి కొట్టాల, శిబిరాల, కార్యాలయాల కుట్రలు బద్దలుకొట్టి, సర్వాయిపాపన్న, అదే ఫతేమైదాన్‌లో పుట్టాడివ్వాళ్ల. వాడు మా వీరుడు. అతనొక పోలీస్ కానిస్టేబుల్. బక్కపల్చటివాడు. గాలికి ఊగిపోయే వాడు. మనిషిలా మనసుతో కదిలిపోయాడు. తెలంగాణ గుండె ఉన్నవాడు. సకల సీమాంధ్ర పెత్తందార్ల ఆధిపత్యం మీద గెలిచినాడు. ఒకే ఒక్కడు. మన కాలం తెలంగాణ వీరుడు. కానిస్టేబుల్ శ్రీనివాస్. గుండెల్లో పొద్దుటినుంచీ గూడుకట్టుకున్న దిగులును ఒక్క నినాదంతో ఔరంగజేబ్ వారసులను గడగడలాడించి, పరుగులు పెట్టించిన ఆ ఒక్కడిదే ఇప్పటి తెలంగాణ చరిత్ర. అతను బుష్‌మీద బూటు విసిరిన అల్‌జైదీ. గుండెలు రగిలి పగిలి కౌరవసేన పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయిన శ్రీనివాస్‌కు ముందు సలామ్. నిజాం కాలేజీ ముందు గాయపడిన వీరయోధుడు దూదిమెట్ల బాలరాజ్‌కు దండం. అతను మన విద్యార్థి వీరుడు. ఒక పిండారీ మంద మీదికి చెప్పువిసిరిన పేరు తెలియని వారికీ వందనం. కానిస్టేబుల్ శ్రీశైలం, గాయపడిన తెలంగాణ జర్నలిస్టు.. వీళ్లు అహంకారాన్ని, అహంభావాన్ని, ఆధిపత్యాన్ని బద్దలు కొట్టారు. తెలంగాణ జేజేలు.

పిండారీ తండాలు నడిపించి , దేవాలయాలను ధ్వంసం చేసిన మొఘల్ సామ్రాజ్యపు మరక, అక్కన్న, మాదన్నల హంతకుడు గోలకొండను కొల్లగొట్టిన ఔరంగజేబ్ వారసుల్లా వారు ఇవ్వాళ్ల హైదరాబాద్ మీద దండయాత్ర చేశారు. పతనం తప్పదు. నిజమే ఇవ్వాళ్ల హైదరాబాద్ మీద యాసిడ్ దాడి జరిగింది. అది బూటు విసిరిన వాడిలాగా చెప్పువిసిరిన వాడి ధైర్యం కావొ చ్చు. అది పోలీస్ డ్రస్‌లో నిలబడి రెండు చేతులూ బారుగా ఆకాశానికేసి జాడించి ‘జై తెలంగాణ’ అని గుండెలోతుల్లోంచి అరచిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కావచ్చు. అది ప్రతీకాత్మకమే. దాన్ని మేము స్వీకరించాం. నిజమే దాడులు జరుగుతుంటే శాంతి, సంయమనం, వచ్చిన తెలంగాణను అడ్డుకునే ఉచ్చులోకి పోకుండా నిభాయించుకుని కడుపునిండా దుక్కపు సంద్రాలను దాచుకున్నాం. కానీ ఒక్క ప్రతీకాత్మక చర్య. మా పుట్టెడు దిగులునూ, పుట్టెడు దుక్కాన్నీ ఛేదించింది. ఇప్పుడిక దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ. పోరాడుతూనే ఉంటాం.

తెలంగాణ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదీ కాంగ్రెస్ పార్టీ కమాండరే. నిస్సహాయంగా తెలంగాణ. గాయపడ్తున్న తెలంగాణ. హైదరాబాద్‌కు వచ్చి , దాడిచేసిన వాడు. హైదరాబాద్‌లో సభ జరిపి,రేపు మిలియన్ మార్చ్ ప్రకటించిన వాడు. పచ్చి అబద్దాలు వల్లె వేసినవాడు. అనైతికంగా నైతిక ఉద్యమం మీద దాడికి దిగినవాడు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తితో జరిగిన ఒక ఉద్యమం సాధించిన ఫలితాన్ని తారుమారు చేయడానికి, మంద బలంతో, ‘కమాండర్’ల బలంతో, కుట్రల బలంతో, ఆధిపత్యంతో, అహంకారంతో విర్రవీగుతున్నవాడు. జనగణమన తెలియనివాడు, ‘సమైఖ్య’ అచ్చుతప్పుతో ఊరేగినవాడు. వీధుల్లో దాడులు చేస్తూ, మైదానంలో బ్రేక్ డ్యాన్స్‌లు చేసేవాడు.

మొత్తం హైదరాబాద్‌ను, మొత్తం తెలంగాణను హెచ్చరించి వెళ్లాడు. ఇప్పుడు మాట్లాడటానికి ఎందుకో ఏ రాజనర్సింహలూ లేరు. సోనియాగాంధీ శాంతి మంత్రం పఠించమంటున్నది. మంత్రులూ శాంతి మంత్రం పఠించమంటున్నరు. కానీ.., కానీ.. శాంతి బలహీనత అయితే, సమభావన చేతగాని తనమయితే విడిపోయి కలిసుందామనేది ఉత్త ఆర్తనాదంగా మిగిలితే.. మా కేఎం ఏడుస్తున్నడు. కడుపుల రేగిన ఆగ్రహం. ఇక ఇప్పుడు తెలంగాణ సిద్ధపడాల్సి ఉన్నది. అహంకారానికి, మంద (మెజారిటీ) ఆధిపత్యానికి ఔరంగజేబు వారసులకు, అనైతిక ఉద్యమ ఆధిపత్యానికి ప్రతీఘాత శక్తులకు శాశ్వత బానిసలు కావడమా? సర్వాయి పాపన్నలా ధిక్కరించడమా? తెలంగాణ తేల్చుకోవల్సి ఉన్నది. సీమాంధ్ర ఎన్జీవోలు తెలంగాణ భూమిలో, తెలంగాణ ఆత్మగౌరవం మీద చేసిన ఈ గాయం, మాసిపోదు. అది చరిత్ర పొడవునా సలుపుతూనే ఉంటుంది. జాగ్రత్త. జాగ్రత్త. కమాండర్లు కలకాలం కాపాడలేరు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *