mt_logo

యాదాద్రి ఆలయ తుది దశ పనులను స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తం ఖరారైన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రిలో పర్యటించారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య అభివృద్ధి పనులను, ప‌రిస‌రాల‌ను పరిశీలించి.. దాదాపు పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించి అధికారులకు తగు సలహాలు, సూచనలు చేశారు.
తొలుత సీఎం కేసీఆర్ టెంపుల్ సిటీ దగ్గర హెలీపాడ్ వద్దకు చేరుకోగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆలయ అధికారులు, తదితరులు సీఎంకు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఘాట్ రోడ్డు ద్వారా నేరుగా కొండపై గల బాలాలయానికి చేరుకోగా.. వేదపండితులు, అర్చకులు ప్రత్యేక అర్చన చేసి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత ప్రధాన దేవాలయానికి చేరుకొని, అక్కడ పెంబర్తి కళాకారులు తయారుచేసిన ద్వారాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరిస్తూ.. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ‘‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’’ అని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రధాన దేవాలయంలో గల బంగారు వర్ణంతో, శంకు-చక్ర నామాలతో ఇండోర్ లో తయారు చేయించిన క్యూలైన్లను, బంగారు తాపడాలు గల ద్వారాలను పరిశీలించారు. జలాశయాల నిర్మాణ తీరును, మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించి, ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, నాయకులతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను, క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు.
ఈ సమయంలో ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరగా.. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చినజీయర్ స్వామి రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని.. ఆలయ ఈఓ గీతకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందించారు. యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, దానిని జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని ఆలయ ప్రధాన అర్చకులకు తెలియజేసారు.
ఆలయ ఉద్యోగులకు పీఆర్సీ వస్తుందన్న సమాధానంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేకం, అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వివిఐపీ గెస్ట్ హౌజ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *