సమైక్య రాష్ట్రంలో నీళ్ళ దోపిడీ భయంకరంగా జరిగిందని, నీళ్ళ విషయంలో తీవ్రంగా దగా పడ్డామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి దోపిడీ విషయంలో ఉమ్మడి పాలనలో తీవ్రంగా దగా పడ్డామని, దీనిపై అనేక సభల్లో, సమావేశాల్లో క్షుణ్ణంగా పేర్కొన్నామని చెప్పారు. రాత్రికి రాత్రే సమస్య పరిష్కారం కాదని, దీర్ఘకాలికంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.
అనేక ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా పూర్తి కాకుండా నిలిచిపోయాయని, 1960లో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని కేసీఆర్ గుర్తుచేశారు. అందరం రైతు, వ్యవసాయ కుటుంబాల నుండే వచ్చాం.. దశాబ్దాల పాటు జరిగిన దగా నేడు మన ముందుకొచ్చింది. డానికి శాశ్వత పరిష్కారం కనుగొందామని సీఎం అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు మనకు ఇచ్చిన ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, ప్రాజెక్టులు ధ్వంసం అయ్యాయని, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంతో కలిసొస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ కోరారు.