mt_logo

మార్చినుండి 9 గంటల కరెంట్..

శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు మనవద్దనే కాదు, దేశమంతా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. 58 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది.. దశాబ్దాలుగా పూర్తికాని ప్రాజెక్టులు మనను చూసి వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చూపించిన ప్రాంతీయ వివక్ష మన రైతులను వెంటాడుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక పరిష్కారం రావాలంటే ప్రాజెక్టుల నుండి నీళ్ళు రావడమే మార్గం.. వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ సర్వనాశనం అయ్యాయి. పరిశోధనలు లేవు.. రైతులకు సలహాలు, సూచనలు లేవు.. వ్యవసాయ శాఖలో ఇప్పటికీ 5 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతల్లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంట్ సమస్య సవాల్ గా మారిందని, దాన్ని అధిగమించామని, కరెంట్ సమస్యలపై కొట్లాట లేకుండా సభ జరుగుతున్నందుకు గర్వంగా ఉందని కేసీఆర్ అన్నారు. తమకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని, అయినాకూడా అన్ని సమస్యలను అధిగమించి కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు. పరిశ్రమలకు 24గంటల కరెంట్ ఇస్తున్నామని, వచ్చే మార్చినుండి రైతాంగానికి ఉదయం పూటే 9 గంటల కరెంట్ ఇస్తామని, 2018 నుండి 3 ఫేజ్ కరెంట్ 24 గంటలు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దామరచర్ల, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *