mt_logo

ధాన్యం కొనుగోలుపై ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

ధాన్యం కొనుగోలుపై వెంటనే ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాల‌ని సీఎం కేసీఆర్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విన‌తి చేశారు. 2021-22 ఖ‌రీఫ్‌ కు సంబంధించి 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాల‌ని, పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని లేఖలో సూచించారు. వ‌చ్చే ర‌బీలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో కూడా స్ప‌ష్టం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం నెల‌కొందని, రాష్ట్రాల నుంచి సేక‌రించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్ప‌ష్ట‌త ఇవ్వ‌ట్లేదని, ఏటా ఉత్ప‌త్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని సీఎం తన లేఖ‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో వ్య‌వ‌సాయ రంగంలో ప్రగతి :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంద‌ని సీఎం పేర్కొన్నారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి రూ. 10,000 పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తూ… తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడని సీఎం కేసీఆర్ త‌న లేఖ‌లో వెల్ల‌డించారు.

ధాన్యం దిగుబ‌డిలో మిగులు రాష్ట్రంగా తెలంగాణ‌ :

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేందని, కానీ నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా తెలంగాణ తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదు అని మోదీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ తన లేఖ‌లో పేర్కొన్నారు.

ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గంద‌ర‌గోళం :

సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురిచేస్తోందని సీఎం కేసీఆర్ తెలియజేసారు. ఎఫ్‌సీఐ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదని, ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతోందని తెలిసినా.. ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదని చెప్పారు. ఎఫ్‌సీఐ అయోమయ విధానాల వలన సరియైన పంటల విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారిందన్నారు. ‘ఉదాహరణకు.. 2021 వానాకాలం సీజన్ లో తెలంగాణలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి అయితే.. అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించింది. అంటే పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమే. ఇది 2019 -20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ. ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుంది’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్ట‌మైన లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో స్వయంగా వెళ్లి క‌లిసి, వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని విజ్జప్తి చేసినప్పటికీ… 50 రోజులు గడిచినా ఎటువంటి సమాచారం లేదన్నారు. దీనిపై ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదని కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *