mt_logo

లోక్‌సభ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని పాటించిన బీఆర్ఎస్

పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. ఎస్టీ, ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్ మినహా ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులతో వరసగా చర్చలు జరిపి సమష్టి నిర్ణయంతో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 5 రిజర్వుడ్ స్థానాలున్నాయి. వాటిల్లో రెండు ఎస్టీ రిజర్వ్ స్థానాలుండగా వాటిలో ఒకటి లంబాడ మహిళకి (మహబూబాబాద్ ) కేటాయించగా మరో స్థానాన్ని  (ఆదిలాబాద్) ఆదివాసి వర్గానికి బీఆర్ఎస్ అధినేత కేటాయించారు.

ఇవి పోగా మిగిలిన మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఈ  స్థానాల్లో.. రెండు పార్లమెంటు స్థానాలను మాదిగలకు (నాగర్ కర్నూల్, వరంగల్ ) కేటాయించగా.. పెద్దపెల్లి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది.

ఇవి పోగా.. ప్రకటించిన మిగతా 11 స్థానాల్లో  5 స్థానాలను బీసీలకు కేటాయించారు. రెండు స్థానాలను మున్నూరుకాపులకు (జహీరాబాద్, నిజామాబాద్), ఒక స్థానాన్ని ముదిరాజ్‌లకు (చేవెళ్ల), ఒకటి గొల్ల కురుమలకు (భువనగిరి), ఒక స్థానాన్ని (సికింద్రాబాద్) గౌడ్ సామాజికవర్గానికి కేటాయించి పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయాన్ని అమలుపరచడంలో బీఆర్ఎస్ పార్టీ మార్గదర్శిగా నిలిచింది.

ఇక మిగిలిన హైదరాబాద్ స్థానం ప్రకటన వస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సంపూర్ణమౌతుంది. కాగా.. హైదరాబాద్ నుంచి పోటీలో బీసీ అభ్యర్థినే అధినేత ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బీసీలకే ఖరారైతే.. రిజర్వుడ్ పోగా మిగిలిన 12 సీట్లల్లో 6 సీట్లు అంటే యాభై శాతం బీసీలకే కేటాయించినట్లు అవుతుంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో ఓసీలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. వాటిలో నాలుగు రెడ్లకు, ఒకటి కమ్మ, ఒకటి వెలమ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.