mt_logo

సీఎం కేసీఆర్ పాలన భేష్ : బీహార్ మైనారిటీ కమీషన్ హర్షం

మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తోందని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ హుస్సేన్ హకీం ప్రశంసించారు. మంగళవారం మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనుస్ హుస్సేన్ హకీం మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల పాటు బీహార్ మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న తన అనుభవంతో గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూలంకషంగా పరిశీలించినట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలను కూడా స్వయంగా చూసినట్లు తెలిపారు. తెలంగాణలో మైనారిటీల కోసం వందలాది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశీ విద్య కోసం నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్షా 81 వేల 398 మంది మైనారిటీలకు షాదీ ముబారక్ పథకం కింద 1,402 కోట్లు విడుదల చేయడం ఒక చరిత్ర అని హకీం పేర్కొన్నారు. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీలకు షాదీ ముబారక్ పథకం ద్వారా అందుతున్న నగదు ఎంతో మేలు చేస్తోందని ఆయన తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల బడ్జెట్‌ను కేటాయించడం కూడా గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా ఖమరుద్దీన్ అందించిన సేవలు ఆమోఘమని హకీం అభినందించారు. మూడేళ్ళ కాలంలో కమిషన్ చైర్మన్ గా ఖమరుద్దీన్ 1,400 కేసులను పరిష్కరించారని కొనియాడారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ ఖమరుద్దీన్, మైనార్టీల రాష్ట్ర నాయకులు సయ్యద్ గులాం, అహ్మద్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *