వరల్డ్ బెస్ట్ విలేజ్ టూరిజం పోటీల్లో తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికవడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ సెప్టెంబర్లో నిర్వహించిన ఈ పోటీలకు మనదేశం నుండి తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి, మధ్యప్రదేశ్ నుండి లద్పురాఖాస్, మేఘాలయ నుండి కాంగ్థాన్ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయగా.. భూదాన్ పోచంపల్లి విజేతగా నిలిచింది. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పడమే కాకుండా..ఆ గ్రామాల్లోని ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం కాగా.. భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని దాదాపు వంద దేశాలకు పైగా పర్యాటకులు సందర్శించి, అక్కడి ప్రజల జీవన స్థితులపై, అభివృద్ధిపై అధ్యయనం చేశారు. ఈ అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేస్తూ.. స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరంలో డిసెంబర్ 2న జరిగే ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ 24వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు తెలియజేసారు.

