mt_logo

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

ఇంతకంటే ఇంకేమైనా ఘోరం ఉంటదా? ఈ పసి బాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే. గురుకుల పాఠశాలల్లో క్షేత్ర స్థాయి నియంత్రణ లోపించింది.. కొంచెం వ్యవస్థను చక్కదిదిద్దండి అని నేను ఎన్నిసార్లు బహిరంగంగా వేడుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ గుండె కరగలేదు అని పేర్కొన్నారు.

24 గంటలు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఆనాడు కేసీఆర్ హాయంలో పెట్టిన పనేషియా కమాండ్ సెంటర్, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నేడు నిరాదరణకు గురైంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎలా నిరాదరణకు గురైందో ఈ వ్యవస్థ కూడా అంతే అయ్యింది అని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

పాఠశాలల్లో కౌన్సిలర్లను నియమించమని వేడుకున్నా కరుణించే నాధుడు లేడు. గత నాలుగు నెలలు కేవలం ప్రతీకార రాజకీయాలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి పేద బిడ్డల కడుపుల్లో వాళ్లకు తెలియకుండానే విషమెట్ల పడుతున్నదో తెలిసే అవకాశమే లేదు అని అన్నారు..

అందుకే ఈ చేతకాని కాంగ్రెస్‌ను అర్జంటుగా ఇంటికి పంపిద్దాం.. మన బిడ్డల ప్రాణాలను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.