సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి వియజయవంతం చేశామన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో దాదాపు 90 నుంచి 95 శాతం వరకు తాగునీటి సమస్య పూర్తయిందన్నారు. అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తున్నాము. రూ.313.26 కోట్ల వ్యయంతో 47.5 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించి, 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం ద్వారా తాగునీటి సరఫరాను మెరుగుపరిచామన్నారు. 13.11 కి.మీ. నీటి సరఫరా గల పైపులైన్ నెట్వర్క్ను రూ.5 కోట్ల 25 లక్షల వ్యయంతో తాగునీరు అందని కాలనీలకు సమకూర్చాలని ప్రతిపాదన చేపట్టి, పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రైతుబజార్, వైదేహీ నగర్, సచివాలయ నగర్, ఆటోనగర్, ప్రశాంతి నగర్, సాహెబ్ నగర్, వాసవీ నగర్కు సంబంధించి.. 47 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించి నీటి సమస్యను తీర్చామని పేర్కొన్నారు.

