హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించాల్సిన తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 17వ తేదీన హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అదే రోజు ఆదివాసీ, బంజారా భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ, గోండ్, లంబాడీ తదితర కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించైనా అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో కేసీఆర్ ప్రసంగించనున్నారని తెలిపారు.
సెప్టెంబర్ 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలచే ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇదే విధమైన కార్యక్రమాలను 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.