స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ హైదరాబాద్ నగరంలో 75 ఫ్రీడం పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త 75 ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా ఈ నెల 10వ తేదీన ఫ్రీడం పార్కుల ఏర్పాటుకు అర్బన్ బయోడైవర్సిటీ విభాగం సన్నాహాలు చేస్తున్నది. వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున చెట్లు నాటాలనే ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోనల్ కార్యాలయాల పరిధిలో ట్రీ పార్కు స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా’న్ని ఈ నెల 8వ తేదీ నుంచి 22 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 10న 75 చోట్ల పెద్ద ఎత్తున ప్లాంటేషన్, అందులో 75 మొక్కలను నాటే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టనుంది. స్థలాలు అనువుగా ఉన్న చోట్ల 750, 7500ల మొక్కలను నాటేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగర చరిత్రలో శాశ్వతంగా నిలిచేలా ఫ్రీడం పార్కుగా నామకరణం చేస్తూ బోర్డులు పెట్టడం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాగా యాదాద్రి మోడల్ మియవాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ లాంటి తదితర రకాల పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులను చేపట్టి హైదరాబాద్ మహానగర నివాసితులకు మెరుగైన చకటి వాతావరణం కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించుటకు పనులు జరుగుతున్నాయి.