తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం, జీఎస్డీపీ 130 శాతం పెరిగిందని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రము ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించింది అని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కానప్పటికీ, కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైనాగానీ, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా, తెలంగాణ రాష్ట్రం అత్యంత అభివృద్ధిని సాధిస్తూ… దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఇంత అద్భుతమైన పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

