తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయింది. భూ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ల వెబ్ సైట్ నుండి కూడా చలాన్ ఆప్షన్లను తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే చలాన్లు కట్టి ఉన్నట్లయితే వారికి మాత్రం ఈరోజు ఎంత రాత్రి అయినా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వోలు భూ రికార్డులు, భూ రిజిస్ట్రేషన్ రికార్డులు మండల రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి రానుండడంతో ఇంకా ఏవైనా అవకతవకలు జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వీఆర్వోలు మండలాల్లోని తాసీల్దార్ ఆఫీసులకు వెళ్ళి భూ రికార్డులు సరెండర్ చేస్తున్నారు.

రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పేరుకుపోయిన అవినీతి మచ్చను తొలగించేలా తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడమంటే రైతులను ఒడ్డున పడేయడమేనని, ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం.. ఒక పౌరుడిగా, న్యాయవాదిగా దీనిని సమర్ధిస్తున్నానని ఒక న్యాయవాది సంతోషం వ్యక్తం చేశారు.
