అటవీ శాఖ విశ్వ బ్రాహ్మణులను వేధిస్తోందనే ప్రచారం నిరాధారం, అవాస్తవ ప్రచారం అని విశ్వ బ్రాహ్మణుల (కార్పెంటర్లు) ఆందోళన నేపథ్యంలో ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (PCCF) పీ.కే.ఝా అన్నారు. చట్ట ప్రకారం వ్యాపారం, పనులు చేసుకునే కార్పెంటర్లపై ఎలాంటి వేధింపులు, ఆంక్షలు లేవని. పైగా చట్టంలోని నిబంధనలను సడలించి విశ్వ బ్రాహ్మణులకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇచ్చిందని చెప్పారు. 12 ఇంచుల వ్యాసం (డయామీటర్) లోపు ఉన్న దూగోడ మిషన్లు వాడకంపై ఎలాంటి ఆంక్షలూ లేవని, ట్రాన్సిట్ పర్మీషన్ – చెట్లు కొట్టడం, తరలించడం, వాడకం కోసం కేవలం 20 చెట్ల జాతులకు ఉన్న మినహాయింపును ప్రభుత్వం పెంచి 44 జాతి చెట్లకు అనుమతిని ఇచ్చిందన్నారు.
మామిడి, వేప, తుమ్మ లాంటి సాధారణ చెట్లకు సంబంధించి కార్పెంటర్లపై ఎలాంటి ఆంక్షలూ లేవని అడవి జాతికి చెందిన, అమూల్యమైన టేకు, నల్లమద్ది ఇతర విలువైన చెట్లపై చట్ట ప్రకారం ఆంక్షలు ఉన్నాయని. పర్మిట్లతో ఈ జాతులకు చెందిన చెట్లు, కలప రవాణా వాడకానికి అనుమతి ఉందాని పీ.కే.ఝా తెలిపారు.
పర్మిట్లు లేకుండా అక్రమంగా విలువైన కలప రవాణా, కార్పెంటర్లు వస్తు తయారీకి వాడకం నిషేదించామని. చట్ట ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయని. వారి నుంచి కలపతో సహా మిషన్లను కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. మొత్తంగా నిబంధనలకు లోబడి, చట్ట పరిధిలో పనిచేసే విశ్వ బ్రాహ్మణ/ వడ్రంగివారు ఎలాంటి భయాలు లేకుండా పనిచేసుకోవచ్చని. చట్టాలను ఉల్లంఘించి అడవికి హాని చేసేవారిపై మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని. అటవీ నేరాలపై కఠినంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను తూ.చ తప్పకుండా అటవీ శాఖ అమలు చేస్తుందని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (PCCF) పీ.కే.ఝా అన్నారు.