తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టులకు 20 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వడానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) అంగీకరించింది. తెలంగాణ స్టేట్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఆర్ఈసీ చైర్మన్ రాజీవ్ శర్మ మంగళవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ తో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టులు, వాటికి అవసరమయ్యే వనరుల సమీకరణ, వ్యయం తదితర అంశాలపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ డిమాండ్ ఉందని, పరిశ్రమలకు విద్యుత్, కొత్తగా ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్ట్, సాగునీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టనుండటంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 8 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని, మరో 12 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి మరో పది, పదిహేనేళ్ళపాటు విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.