శుక్రవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గసమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొని రాజకీయ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, తెలంగాణలో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాదని, తమ మద్దతు ఎన్డీయేకు ఉండదని ఆన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞులమై ఉంటామని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని ప్రకటించారు. సీమాంధ్రలో జగన్ వందకుపైగా సీట్లు గెలుస్తాడని, చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడని, సీమాంధ్రలో జగన్ సీఎం అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని, ప్రజలంతా టీఆర్ఎస్ కే ఓటేశామని చెబుతున్నారని, దక్షిణ తెలంగాణ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మాదే గెలుపని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, క్యాంపులు పెట్టే అవసరం తమకు లేదని, పొన్నాల తన నీచరాజకీయాలు మానుకోవాలని, టీఆర్ఎస్ నిప్పులాంటి పార్టీ అని, పట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి 23నుండి 35స్థానాలు మాత్రమే వస్తాయని, 16వ తేదీ మధ్యాహ్నం కల్లా ఎవరేంటనేది తేలిపోతుందని, 20 మంది ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నారని అంటున్న పొన్నాల బ్రోకరని, ప్రజలు చూస్తూ ఊరుకోరని మండిపడ్డారు.
జగన్, చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ఉండం, సీమాంధ్రలో చెట్లకిందయినా ఉంటామన్నారని, అలాంటప్పుడు భవనాల విభజనపై రాద్ధాంతమెందుకని? ప్రశ్నించారు. ఉద్యోగులను కలిపి ఉంచొద్దని, రెండు రాష్ట్రాలకు విడివిడిగా భవనాలు ఇమ్మని గవర్నర్ ను అడుగుతున్నామని, ఉద్యోగుల పంపిణీపై కొన్ని పత్రికలు పంపకాలు చేస్తున్నట్లుగా వక్రించి రాస్తున్నాయని, ఏది జరిగినా రెండు రాష్ట్రాల సీఎం లు కూర్చుని చర్చించిన తర్వాతే పంపకాలు జరుగుతాయని, ఇప్పుడు జరిగేదంతా ప్రతిపాదనలే అని కేసీఆర్ పేర్కొన్నారు.