mt_logo

సినీ తారతమ్యాలు: ఆంధ్ర పక్షపాతం, తెలంగాణ ద్వేషం

-మాడభూషి శ్రీధర్

తెలుగు సినీ పరిశ్రమ కుల, కుటుంబ సామ్రాజ్యాలతో పీలికలుగా చీలిపోయి, గుత్త పెత్తన వ్యాపారదుర్గాలుగా క్షీణించి అభిమానుల్ని, ప్రజల్ని చీల్చివేసింది. ఈ ప్రాంతంలో భూములు, నీళ్లు, చెరువులు, సబ్సిడీలు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతూ తెలంగాణపై అంతులేని విషాన్ని, విద్వేషాన్ని కక్కుతున్నది. పైకి కళామతల్లి. తెర మీదనే సమైక్య సందేశం. తెర తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని వెక్కిరించే ద్వేషం. ఈ తారల నిజస్వరూపం తెలుసుకోవడం కష్టం. రాజకీ య నాయకులు నటనలో ఈ తారలతో తీసిపోనట్టే, రాజకీయాలలో సినీనటులు నాయకులకన్నా తీసిపోరు. రాజకీయపార్టీల వలెనే సినీపరిశ్రమలో పేరెన్నిక గన్న కుల కుటుంబాలు తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉండవు అనే మాటకు వ్యతిరేకార్థం తీసుకోవలసిందే. వారిలో నరనరాల జీర్ణించుకుపోయిన తత్వం – కుల తత్వం, ప్రాంతీయ తత్వం, తెలంగాణ వ్యతిరేకత్వం. 1969లో తెలంగాణ ఉద్యమం సాగుతున్నపుడు ఈ ప్రాంతీయాతీత మహోన్నత కళాకారులంతా మన అభిమానుల్లో సగం మంది ఎందుకు వేరు రాష్ట్రం కావాలనుకుంటున్నారని కనీస ఆలోచన కూడా చేయకుండా సమైక్య నినాదాలు, గీతాలు రాయించి సినీ దృశ్యాలు తీయించి జనం మీదకు వదిలినవారే.

ముల్కీ నియమాలు రాజ్యాంగ వ్యతిరేకం అని రాష్ట్ర హైకోర్టు 2:1 మెజారిటీతో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసి, హైకోర్టు మైనార్టీ తీర్పు ఇచ్చిన జస్టిస్ కొండా మాధవ రెడ్డి (తెలంగాణ బిడ్డ) అన్వయాన్ని సమర్థిస్తూ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని నిర్ధారించిన తరువాత ఆ తీర్పు ఫలాలు తెలంగాణకు అందకుండా 1972లో జై ఆంధ్ర ఉద్యమం లేవదీశారు, రాజ్యాంగబద్ధమైన ముల్కీ నియమాలను రాజకీయంగా నాశనం చేసి, తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించే విధంగా ఇందిరాగాంధీ మీద ఒత్తిడి చేయడమే వీరి లక్ష్యం. 1969లో సమైక్యత పేరుతో తెలంగాణను వ్యతిరేకించిన వారు, 369 మంది తెలంగాణ కోసం కాల్పుల్లో చనిపోతే ఒక్క సానుభూతి మాట కూడా చెప్పలేదు ఈ సినీ నట రత్నశేఖర సమ్రాట్టులు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయిన వారికైనా సానుభూతి పలికే మానవత్వాన్ని నటించారు. పత్రికల్లో ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు జనవరి 1973లో ఇచ్చారు. సినిమాలకు వసూలైన సొమ్ములో ఒకరోజు మొత్తాన్ని చనిపోయిన వారి సహాయనిధికి ఇచ్చారు.

అప్పుడు మంచివాళ్లకు మంచివాడు సినిమా ఒకరోజు వసూళ్లు ఇచ్చి కృష్ణ ఆయన భార్య విజయనిర్మల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మద్రాసులో ఒకరోజు నిరాహారదీక్ష కూడా చేశారు. ఇక ఎన్‌టిఆర్, తెలుగు ఆత్మగౌరవ పరిరక్షకుడు, తెలుగుదేశ వ్యవస్థాపన చేసి అల్లుడి చేతిలో ఆ పార్టీని పెట్టిన నటరత్న 1969 కాలంలో సమైక్యాంధ్ర సినీగీతాల వైతాళికుడే. అయినా జైఆంధ్ర ఉద్యమ కాలానికి మాట మార్చి ప్రత్యేకాంధ్ర ఇవ్వాలన్నారు. నటసామ్రాట్ బిరుదాంకితులైన అక్కినేని నాగేశ్వరరావు వారితో గొంతు కలిపి ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలని 1973 ఫిబ్రవరి 17న బ్రహ్మాండమైన పత్రికా ప్రకటన చేశారు. (ఇది ఆనాటి ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ఆ ముక్కను ప్రచురిస్తూ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28న సవాల్ రెడ్డి గారు ‘నమస్తే తెలంగాణ’లో ఒక వ్యాసం రాశారు). తెలంగాణలో ఉన్న అభిమానులు చనిపోతే ఫరవాలేదు, వారికి సమైక్య మంత్రోపదేశం చేస్తారీ మహానుభావులు. జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలుపోయిన అభిమానులకు ధనసాయం చేసి సమైక్యవాదానికి పాతర వేస్తారు ఈ నటవీరులు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్న నీతి వీరికి తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించవలసినప్పుడు గుర్తురాలేదు.

1973లో ఆంధ్రుల కోసం గుర్తొచ్చింది. భిన్నదృక్పథాలతో కలిసి ఉండడం కంటే స్వేచ్ఛగా సోదరభావంతో జీవించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు అప్పుడు చెప్పుకున్నారు ఈ ఇద్దరు నటులు. ఎన్టీఆర్ లేకపోయినా ఆయన కుటుంబం ఇంకా రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ వెలుగులు వెలుగుతూనే ఉన్నది. ఎన్నార్ తన మూడుతరాల కుటుంబ సినీ సమ్రాజ్యాన్ని సామ్రాట్టుగా హైదరాబాద్‌లో ఏలుతూనే ఉన్నారు. కళాకారులు రాజకీయాలకు అతీతమైనా, ప్రజాదరణతో పెంపొందిన కళారంగం ప్రజల మనోభావాలకు ఎప్పుడూ విరుద్ధంగా ప్రవర్తించదని కనుక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా ఆంధ్రవూపదేశ్‌ను విభజించాలని డిమాండ్ చేశారు ఈ మాట్నీ దేవుళ్ళు. వారి వారసులు ఇక్కడి ఎస్టేట్ వ్యవహారాలలో పడిపోయి ఇది ఎవరి స్క్రిప్టో, ఎవరి డైలాగులో మరిచిపోయి ఉంటారు. ఆనాటి తమ ప్రకటన వారికి ఇప్పుడు గుర్తుకు రాదు.

వీరే కాదు పత్రికావ్యాపార ప్రకటనల రూపంలో 1973 జనవరిలో పలువురు విసిరిన కొన్ని సినీ డైలాగులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. తెలుగుసినీ పరిశ్రమ మానవతా నిధి సమితి వారు ఈవిధంగా ప్రకటించారు: ఒకనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి సామరస్యంగా ఆంధ్రులు విడిపోయారు. ఈనాటికి కూడా లక్షలాది తెలుగు వారు ఇంకా తమిళనాడులో స్థిరపడిపోయారు. ప్రభుత్వ న్యాయ సినీ వ్యాపార పారిశ్రామిక కళా రంగాలలో ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నారు. వారు తెలుగువారని చెప్పితే తప్ప తెలియనంతగా తమిళ సోదరులు వారిని తమలో కలుపుకున్నారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ సోదరులు విడిపోయినా ఎంతో సామరస్యంతో ఒక తల్లిబిడ్డల్లా బతుకుతూ పురోభివృద్ధి చెందగల సదవకాశం ఉన్నది, ఆ అవకాశాన్ని కేంద్ర నాయకత్వం స్వప్రయోజనాలకోసం అవరోధిస్తున్నది…. అంటూ అమరవీరులకు విరాళాలు ఇవ్వమని అడిగారు. తెలుగు చలన చిత్ర నిర్మాతలు మరొక ప్రకటన విడుదల చేస్తూ ఒకే భాషకు చెందిన తెలుగుజాతి 16 సంవత్సరాల కలయికలో పొందిన అనుభవంతో సోదరులుగా విడిపోయి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించుకుని సుహృద్భావంతో ప్రశాంతంగా జీవించాలని ఉభయులూ ఆరాటపడుతున్నారు… వేర్పాటుకు అంగీకరించి ఈదారుణ రక్తపాతాన్ని అరికట్టవలసిందిగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.

ఇదేరకమైన వినతిని కవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, పిలకా గణపతి శాస్త్రి, ఆరుద్ర, అనిసెట్టి సుబ్బారావు, కె రామలక్ష్మి, దాశరథి, సినిమా డైరెక్టర్లు కె ప్రత్యగాత్మ, కె ఎస్ ప్రకాశరావు, జి రామినీడు, హేమాంబరధరరావు, తాతినేని రామారావు, ఎ. పూర్ణచంవూదరావు, టి. ఎల్. బాబు, ప్రొడ్యూసర్లు పి వి సుబ్బారావు, చెరుకూరు ప్రకాశరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కె. కుటుంబరావు విడిగా ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన చేయాలని 1973 జనవరి 24న 60 మంది చిత్ర నిర్మాతలు వినతి చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజల కోర్కెకు తమ సమావేశంలో పూర్తి మద్దతు వ్యక్తం చేశారు.

ప్రజలు ఏమికోరుతున్నారో తెలుసుకుని పరిష్కారమార్గం ఆలోచించాలని ఆనాటి హీరోయిన్ వాణిశ్రీ అడ్వర్టయిజ్‌మెంట్ ద్వారా అభ్యర్థించారు. తాను ఉద్యమ దిగ్విజయాన్ని ఆకాంక్షించే ఆంధ్రుడిని అంటూ సినీ హీరో రామకృష్ణ ఇంకో వాణిజ్య ప్రకటనలో చెప్పారు. జై ఆంధ్ర అంటున్న ఆంధ్రుల ఆనందం కోసం వారితో ఒక కంఠం కలుపుతానని, ఒక లాటీ దెబ్బయినా తినాలని అలా కాని నాడు నేను ఆంధ్రుడనే కానని నాకు అనిపించిందని మరో హీరో కృష్ణంరాజు వ్యాపార ప్రకటన విడుదల చేశారు. అన్నదమ్ములు విడిపోతానంటే పెద్దలు కలసి ఉండమని చెప్పడం మంచిదే కాని విపత్కర పరిస్థితిలో కలిసి ఉండమనడం మూర్కత్వమే అవుతుంది (అచ్చుతప్పు ఆ వ్యాపార ప్రకటనలోదే, నాది కాదు) అని కృష్ణంరాజు చెప్పారు. ఇప్పుడు వేయిమంది చనిపోయినా చలించని వీరు తెలుగువారా?

రోము పట్నం తగులపడుతుంటే ఆనందంతో నీరో రాజు ఫిడాలు వాయించాడుట అలాగాక ప్రస్తుతపు గడ్డు పరిస్థితిలో ఆనందం కోసం సినిమాలు ప్రదర్శించడం నాకిష్టం లేదు అంటూ నాటి కథానాయిక జమున గుంటూరులోని తన అలంకార్ ధియేటర్‌ను 26.1.73నుంచి కొంతకాలం నిలిపివేయుటకు నిశ్చయించుకున్నానని తన వ్యాపార ప్రకటనలో వివరించారు. జై ఆంధ్ర అమరవీరులకు ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. వీరి దృష్టిలో తెలంగాణ ఉద్యమ వీరులు బలిదానం చేసినా అమర వీరులు కాదు, అసలు మనుషులే కాదు.

చలం, శారద మాత్రం అటు తెలంగాణ సోదరులు ఇటు ఆంధ్ర సోదరులూ ప్రత్యేక రాష్ట్రం అనే ఒకే లక్ష్యంకోసం ప్రాణాలను బలిదానం చేస్తున్నారని సానుభూతి తెల్పుతూ ఇంకొక వ్యాపార ప్రకటన చేశారు. రక్తపాతం లేకుండా గమ్యం చేర్చే నాయకత్వాన్ని ప్రసాదించాలని భగవానుని ప్రార్థిస్తున్నానంటూ అంజలి ఘటించి అంజలీదేవి వ్యాపార ప్రకటనలో జై ఆంధ్ర అన్నారు. ఈ విధంగా కృష్ణ, విజయనిర్మల, శోభన్ బాబు, యస్ వి రంగారావు జనవరి 1973లో అనేక ప్రకటనలు విడుదల చేశారు.

ఈ ప్రకటనలు ప్రచురించిన పత్రికలను స్కాన్ చేసి మిషన్ తెలంగాణ వెబ్‌సైట్‌లో మిత్రుడు కొణతం దిలీప్ అందరికీ అందుబాటులో తెచ్చారు. ఈ మానవతావాదులు, సమైక్యవాదం తప్పని తెలుసుకున్న కళాకారులు అహింసాత్మకంగా సాగుతున్న ఉద్యమం పట్ల ఎవరినీ బాధించకుండా తామే తనువులు త్యాగం చేసిన వేయిమంది తెలంగాణ బిడ్డల పట్ల ఏమాత్రం సానుభూతి చూపకుండా రాక్షస మౌనం పాటించడం ఏం న్యాయం. వారి వ్యాపారాలు, సినిమాలు, సన్మానాలు భజనలే తప్ప జనం గొడవే వీరికి పట్టదు. చనిపోతున్నవారిలో వీరి అభిమానులున్నారని వీరికితోచదా?. కళకు వ్యాపారాలు, డబ్బుకు కులాలు, సినిమాలకు ప్రాంతీయభేదాలు ఉంటాయని ఇవేవీ లేని అభిమానులకు తెలియదు. ఇటువంటి పిచ్చి అమాయకులనే అందరూ మోసం చేస్తారు.

రాజకీయపార్టీల వలెనే సినీ ప్రముఖులు కూడా తెలంగాణను వ్యతిరేకించడానికి సమైక్యవాదాన్ని వినిపించారు. అవకాశం దొరికినపుడు, నకాబు తీసి, జైఆంధ్ర అంటూ తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణను ఇంకా దోచుకోవడం కోసం మళ్లీ సమైక్యం సమైక్యం, తెలుగువారంతా ఒకటి, అన్నదమ్ములు అంటూ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీశ్రీ వాక్యాన్ని తెలుగు సినీ సామ్రాజ్య చరిత్ర కూడా అక్షరాలా అమలు చేస్తున్నది. తెలుగు సినిమా వాళ్లు మద్రాసులో ఉన్నంత కాలం దగ్గరగా ఉన్న కోస్తాంధ్ర జిల్లాల సంపన్న వర్గాలు ఆధిపత్యం చెలాయించారు. వీరేదో ఆంధ్ర దేశానికి మేలుచేసినట్టు కళామతల్లికి సేవచేసినట్టు నటిస్తూ హైదరాబాద్‌కు తరలినప్పుడు, విపరీతమైన సర్కారీ సబ్సిడీలతో ఎకరాలకు ఎకరాలు భూములు భోంచేసేశారు. పేరుకు కళ, చేసేది ఫక్తు వ్యాపారం, అదీ అందరికీ అవకాశం ఇచ్చేనీతే లేని కుల వ్యాపారం. శ్రమదోపిడీ, జూనియర్ ప్రతిభావంతులమీద ప్రముఖ రచయితల మేధోసంపత్తి చౌర్యం,, జూనియర్ కళాకారులను శృంగార వస్తువులుగా వినియోగించే ఘరానా వ్యభిచారం, తమ కులానికి చెందని వారినే ఏకైక కారణంతో ఆ వ్యక్తులను అన్నిరకాలుగా వాడుకోవడం, అవకాశాలు రాకుండా తరిమివేయడం, దొంగకేసుల్లో ఇరికించడం, శీలహనన ప్రచారాలతో భ్రష్టు పట్టించడం, కుల గుత్తాధిపత్యంతో ఇతరుల సినిమాలు ఆడడానికి వేదిక కూడా లేకుండా వేధించడం అందరికీ తెలిసినవే. ఈ సంకుచిత సమ్రాట్టులు, సూపర్‌లు మెగాలు, రత్నాలు, పద్మాలు తెలంగాణపై దోపిడీ కొనసాగడం కోసం సమైక్య సూత్రాలు వల్లించి తెలంగాణ వ్యతిరేకత చాటుకుంటున్నారు. అమ్ముడుబోయే రచయితలు సమైక్యాంధ్ర గీతాలు రచిస్తారు. సినీ టీవీ మీడియాలో పాడిందే పాట గా వేస్తుంటారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే పాటకు మేకప్ తీసేస్తే అంతా మనది చేసుకుని మేమే వెలుగుతాం అనే ధోరణి కనిపిస్తుంది.

అన్నహీరో, తమ్ముళ్లు మాదకవూదవ్యాలు అమ్ముకునే వారు, మరికొందరు ఎస్టేట్ మేనేజర్లు, ఇంకొందరు వ్యాపార వ్యవహారాలు చూసేవారు. ఇతర తమ్ముళ్లు రాజకీయాలు నడిపేవారు. ఇదీ వీరి కళాపోషణ. వీరి కళాసేవ ఓ బోగస్. సమైక్యత ఓ ఖాళీనినాదం, కుట్రల విధానం. డబ్బు సంపాదన, సొంత కుటుంబ వారసులను జనం నెత్తిన రుద్దడం తప్ప వీరికి మరో లక్ష్యం ఉందా. బెట్టింగ్‌తో ఏ విధంగా క్రికెట్‌ను ఐపిఎల్ భ్రష్టు పట్టించిందో, సీమాంధ్ర సినీ పరిక్షిశమ, మోస వ్యాపార గుత్తాధిపత్యాలతో కళను ఏనాడో కళంకితం చేసింది. గుడ్డి అభిమానంతో తారలను ఆరాధించే మూర్ఖ, అమాయక, తెలివి తక్కువ, వెర్రిమాలోకాలు ఆడియో రిలీజ్ సొంతడబ్బా వంశ కీర్తి భజన కార్యక్షికమాలకు హడావుడిగా వచ్చిరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడం మానేసి ఈ దుర్మార్గుల కుట్రలు వ్యాపారాలు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే వీర ఆటలు శతదినోత్సవాలు చేసుకుంటున్నాయి. వీళ్లే ప్రచారాలకు వస్తారు. తెలంగాణ వ్యతిరేకంగా కుహనా సమైక్యం వినిపిస్తారు. ఈ కళావ్యాపారుల నిజస్వరూపాలు తెలుసుకోవడమే అసలు సిసలు చైతన్యం. ఇప్పుడున్న గాంధీలు నిజంగా గాంధీలు కాదు. కాంగ్రెస్ తాతల నాటి కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం ఎన్టీఆర్ స్థాపించిన ఒరిజినల్ పార్టీ కాదు, రంగులు పూసుకుని విగ్గులు పెట్టుకుని ఎవరో రాసిచ్చిన వాక్యాలు భట్టీ బట్టి చదివే వ్యాపారులు కళాకారులు కాదు. అభిమానులంతా ఈ నిజం అర్థం చేసుకున్నప్పుడే నిజమైన కళకు నీరాజనాలు అందుతాయి. కుల కుటుంబ కళా విహీన నీలి వ్యాపారాలు కుప్పగూలుతాయి.

నమస్తే తెలంగాణ నుంచి…—

Related article:

తెలంగాణ వ్యతిరేకతే సీమాంధ్ర సినిమా పరిశ్రమ నైజం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *