తెలంగాణ వ్యాప్తంగా రేపటినుండి ప్రారంభమయ్యే ఆసరా పథకాన్ని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయమై ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఒకరికి పించన్ వస్తుందని, అదేవిధంగా ఒకే ఇంట్లో వృద్ధుడు, వితంతువు, వికలాంగుడుంటే ముగ్గురికీ పించన్ వస్తుందని చెప్పారు. స్కెలెటిన్ ఫ్లోరోసిస్ ఉన్నవారిని వికలాంగులుగా గుర్తించి పించన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ. 3 వేల కోట్ల భారం పడుతుందని, నవంబర్ లో దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా ఆర్అండ్ బీ, పంచాయితీ రాజ్ రహదారులపై సీఎం కేసీఆర్ సమీక్షాసమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం, రహదారుల శాఖకు చెందిన అధికారులు హాజరయ్యారు. రోడ్ల నిర్మాణం, అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించారు.