mt_logo

హరితహారం సూపర్ హిట్… అటవీ పెరుగుదలలో తెలంగాణ దేశంలో రెండోస్థానం

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47 శాతం అడవులు ఉన్నాయి. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలో నగరంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో గత రెండేండ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరుగగా, తెలంగాణలోనే 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదుకావటం విశేషం. దేశంలో విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్‌లో, శాతం పరంగా మిజోరంలో అడవులు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా- 2021 రిపోర్టులో తెలిపింది.

2015 నుంచి 2021 వరకు అడవి పెరుగుదల :

*రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అందులో 2021 నాటికి అడవులు 26,969 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 21.47 శాతం.
* 2015లో తెలంగాణకు హరితహారం ప్రారంభమైన తర్వాత 2015-17 మధ్య కాలంలో 565 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 16,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.
* 2017-19 మధ్యలో మరో 163 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు పెరిగాయి.
* 2019-21 మధ్య 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 63,200 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.
* 2014-2019 మధ్య అటవీ పచ్చదనం 6.85 శాతం పెరిగింది. చెట్ల పచ్చదనం 2014లో 2,487 చదరపు కిలోమీటర్లు ఉండగా హరితహారం మొదలైన తర్వాత 2014-19 మధ్య 361 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది 14.51 శాతం పెరుగుదల.

తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటడం సత్పలితాలిస్తున్నది. రాష్ట్రంలో 63,200 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త పచ్చదనం పెరిగింది. పచ్చదనం పెరిగిన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా, హైదరాబాద్‌ నగరం 4,866 హెక్టార్ల కొత్త పచ్చదనం వృద్ధితో దేశంలోని మెగాసిటీలో నంబర్‌ 1గా నిలిచినట్టు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ తెలిపింది.

మెట్రో నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్ :

రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలు(కోట్లలో) : ప్లాంటేషన్‌ 20రూట్‌, స్టాక్‌ రెజువనేషన్‌ 80
అడవి బయట జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటగా, ఇతర ప్రాంతాల్లో 130 కోట్లు నాటారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పథకం కింద 6556 కోట్ల వ్యయంతో 230 కోట్ల మొక్కలు నాటారు. ఇక దేశవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో మహానగరాల్లో పచ్చదనం పెరగటంలో హైదరాబాద్‌ ప్రథమస్థానంలో నిలిచింది. గడిచిన పదేళ్లలో హైదరాబాద్ నగరంలో ఏకంగా 4,866 హెక్టార్లలో అదనంగా అటవీ విస్తీర్ణం పెరిగింది. ఆ తరువాత ఢిల్లీ 1,991 చ.కిమీ, అహ్మదాబాద్‌ 855 చ.కి.మీ 498 చ.కి.మీ స్థానాల్లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *