mt_logo

తెలంగాణ పారిశ్రామిక రంగంపై సీమాంధ్రుల కన్ను!

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు అప్లై చేసుకున్న కొంతమంది పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటుచేసుకోమని కొందరు సీమాంధ్ర అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకూ ప్రత్యేకహోదా కల్పిస్తామని చెప్పినా, కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ప్రత్యేకహోదా అంటూ పరిశ్రమలశాఖ లోని కొందరు అధికారులు ప్రచారం చేయడంపై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.

గతంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అనుమతి కోరుతూ 148 దరఖాస్తులు రాగా వీరిలో చాలామంది తెలంగాణలోనే పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధపడ్డారని తెలిసింది. అయితే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగినందున ఇన్నాళ్ళూ ఆ దరఖాస్తులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని ప్రాజెక్టులన్నీ సీమాంధ్రకు తరలించేందుకు పరిశ్రమలశాఖకు చెందిన కొందరు కుట్రలు పన్ని తమదగ్గరకు దరఖాస్తు చేయడానికి వచ్చే పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఉండడంవల్ల అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే పన్నులభారం ఉండదని, అధిక లాభాలు పొందవచ్చని సలహాలు ఇస్తున్నారు.

మరోవైపు అన్ని శాఖల విభజనతో పాటు పరిశ్రమలశాఖ కూడా రెండుగా విడిపోనుంది. రెండు ప్రాంతాలకూ వేర్వేరు వెబ్ సైట్లు ఏర్పాటుచేయనుండగా, రెండింటికీ ఒకే సర్వర్ ను ఉపయోగించనున్నారు. ఒకే సర్వర్ ఉంటే ఒక రాష్ట్రానికి వచ్చిన దరఖాస్తులు మరో రాష్ట్రానికి తెలిసిపోతాయి. అదీకాక సీమాంధ్రకు చెందిన ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలను ప్రభావితం చేసి పరిశ్రమల స్థాపనలో తమ ఆధిపత్యాన్ని చూపేందుకు మార్గం ఏర్పడుతుందని, ఎట్టిపరిస్థితుల్లో అపాయింటెడ్ డే కల్లా రెండు రాష్ట్రాలకూ రెండు వెబ్ సైట్లు, రెండు సర్వర్లు ఏర్పాటు చేయాలని, పెండింగ్ దరఖాస్తులను సమీక్షించాలని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *