కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త, 110 ఏళ్ల వయసున్న సాలుమరద తిమ్మక బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని… వ్యవసాయం, అటవీ రంగాల్లో అభివృద్ధి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తిమ్మక్కను స్వయంగా సమీక్ష సమావేశానికి తీసుకువెళ్లి సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. అందరి సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక సీఎంకు స్వయంగా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక పడుతున్న తపన సమావేశంలో పాల్గొన్నవారిలో స్ఫూర్తిని నింపింది.

