ఈ నెల 25న హైటెక్స్లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ సాధించుకొని, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. తమ పార్టీ విధానాలను, పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన బ్రహ్మండంగా సాగుతుందని, అపూర్వమైన విధానాలతో, పాలసీలతో ఇతర రాష్ట్రాలతో పాటు దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది… కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారిందని మీడియాతో అన్నారు.

