mt_logo

తెలంగాణలో మంటరాజేసిన పార్లమెంటు దాడి

పార్లమెంటులో తెలంగాణ బిల్లు అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎంపీలు చేసిన వెకిలి చేష్టలకు నిరసనగా తెలంగాణ అంతటా తీవ్ర నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. సీమాంధ్ర నేతలు లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని అన్ని పార్టీల తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ పది జిల్లాలలో సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలకు నిరసనగా వరంగల్ లో న్యాయవాదులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి బాబు దిష్టి బొమ్మను, పార్టీ జెండాలను కాల్చివేశారు. సీమాంధ్ర ఎంపీలపై జీవితకాలం నిషేధం విధించాలని ఖమ్మం లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తల్లి పొన్నం మల్లమ్మ లగడపాటిని అరెస్టు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ చౌక్ లో నిరసన దీక్ష చేశారు. నల్గొండ జిల్లా రామగిరి సెంటర్ లో తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్వీ, ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా అంతటా సీమాంధ్ర ఎంపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మిగతా అన్ని జిల్లాలలో కూడా సీమాంధ్ర నేతల దిష్టి బొమ్మలు దహనం చేసి తెలంగాణ వాదులు తమ నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *