తెలంగాణలో మారుమూల ఉన్న మెదక్ జిల్లా కంగ్టి మండలం దేగులవాడి గ్రామానికి మార్జోడి నర్సింహ శుక్రవారం హైదరాబాదులో ఆంగ్ల పదజాలంలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. రూ.50 వేలు నగదు గెలుచుకుని సంచలనం సృష్టించాడు.
మాదాపూర్లోని మహీంద్రా సత్యంలో ఆగస్ట్ 30 నాడు అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’లో అనేకమంది కార్పొరేట్ స్కూళ్ల విద్యార్ధులు పోటీపడగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న నర్సింహ విజయం సాధించాడు.
నర్సింహ తండ్రి కూలి పనులు చేసుకుంటుండగా, తల్లి లలితమ్మ, సోదరుడు రవికుమార్లు హైటెక్సిటీలోని ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.
నర్సింహ ప్రస్తుతం ఉండేది గచ్చిబౌలిలోని సిద్దిఖ్నగర్లో కాగా అతను అంజయ్యనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు.
చదువులో ముందున్న నర్సింహ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించే అట్లాంటా ఫౌండేషన్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో అట్లాంటా ఫౌండేషన్ వారు నర్సింహకు ఇంగ్లీష్ పదజాలంలో కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చారు.
భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ కావాలని నర్సింహ కోరికట.