ఈరోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితీ రెండవ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొత్తం 3,342 పంచాయితీల్లో రెండవ విడత పోలింగ్ జరిగింది. నిజానికి 4,135 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 788 పంచాయితీలు ఏకగ్రీవం కాగా, కోర్టు కేసులతో పాటు, రిజర్వేషన్ల సమస్య ఉండటంతో మరో ఐదు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మొత్తం 3,342 పంచాయితీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. 10,668 మంది సర్పంచులు బరిలో నిలిచారు. ఇదిలావుండగా 36,602 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, కోర్టు కేసులు, రిజర్వేషన్ల సమస్య వల్ల 94 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో 10,317 వార్డులు ఏకగ్రీవం అయినందున 26,191 వార్డులకు పోలింగ్ నిర్వహించారు.