తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందువల్ల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 12న హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి, ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో ధర్నా చేపట్టనున్నారు. ఇందుకోసం బుధవారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ధర్నాచౌక్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ధర్నాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు.

