mt_logo

సిద్దిపేట నుండి మొదలైన పోస్ట్ కార్డు ఉద్యమం

సిద్దిపేట నుండి మరో ఉద్యమానికి, వినూత్న కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు.

సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్‌లో, సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో, చిన్న కోడూర్ మండలం మార్కెట్ యార్డ్‌లో రైతులు స్వచ్ఛందంగా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సీఎం రేవంత్ కి పంపారు.

రైతులకు ఇచ్చిన కాంగ్రెస్ హామీలు పలు హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ రూ. 500, రైతు భరోసా రూ. 10,000లకి బదులు 15000 రూపాయలు,  రైతు కూలీలకు ఇస్తానన్న రూ. 12,000, రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు, రైతు బీమా, వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా ఎకరాకు రూ. 25,000 వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతాం అని హెచ్చరించారు.