గత ప్రభుత్వాలు రూ. 200 పించన్ ఇస్తుండగా ఆ పించన్ ను రూ. 1000 కి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఆసరా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల్లో పించన్లు బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా చూస్తామని, పించన్ల కోసం దళారులను ఆశ్రయించొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.
మరోవైపు కరీంనగర్ లో ఆసరా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని, ఈ పథకంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, విద్యుత్ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై టీడీపీ అనవసరంగా ఆందోళన చేస్తుందని మండిపడ్డారు. టీటీడీపీ నేతలు చంద్రబాబు కనుసైగల్లో పనిచేస్తున్నారని, తెలంగాణలో బస్సుయాత్రలు, ధర్నాలు చేసే నైతిక హక్కు టీటీడీపీ నేతలకు లేదన్నారు. సీఎం కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని భావించి ప్రజలు తమకు ఓట్లేశారని, తమది పేదల ప్రభుత్వమని కేటీఆర్ చెప్పారు.