నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్ రెడ్డి, చందూలాల్, పార్టీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు తెలిసిన విద్యావంతుడైన రాజేశ్వర్ రెడ్డి ని గెలిపిస్తేనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని, అందరం కలిసికట్టుగా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. సీఎం ఇచ్చిన ఫిట్ మెంట్ తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, టీడీపీ మద్దతు ఇచ్చిన బీజేపీని ఓడించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీకి బుద్ధి చెప్పాలని హరీష్ పేర్కొన్నారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని, సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారని అన్నారు. పథకాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, పట్టభద్రులు భారీగా తరలిరావడం చూస్తుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తుందని, పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకుంటే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.