mt_logo

పదిరోజుల్లో రెండు రాష్ట్రాలకూ సిబ్బంది షురూ..

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల విభజన పూర్తయ్యింది. కమల్‌నాథన్, ప్రత్యూష్ సిన్‌హా కమిటీ నివేదికలు తయారయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాకులోని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని, కమల్‌నాథన్ కమిటీని, ప్రత్యూష్ సిన్‌హా కమిటీని కలిసి ఉద్యోగుల విభజనకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించారని సమాచారం. ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయా అని విలేకరులు ప్రశ్నించగా మహంతి సమాధానం చెప్పడానికి నిరాకరించారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు, ఆప్షన్లపై సీరియస్‌గానే చర్చ జరిగినట్లు, ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని తెలిసింది.
ఈనెల 24లోగా విభజన ప్రక్రియ పూర్తిచేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయడంతో వివిధ ఉద్యోగసంఘాల వద్దనుండి సేకరించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 42:58 నిష్పత్తిలో ఉద్యోగులను విభజించారని, ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెడతామని కమిటీ ఇప్పటికే తెలిపింది.
ఇదిలాఉండగా, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగులకు ఆప్షన్లు, డిప్యుటేషన్లు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ వెళ్ళి కమల్‌నాథన్ కమిటీని, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిసి ఒక మెమొరాండంను సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాలకోసమే అని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులను తెలంగాణలో కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అర్థం లేదని, ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు ఉండకూడదని, ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం ఉండకూడదనేదే తమ లక్ష్యమని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ భవన్‌లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను చూడటానికి ఆంధ్రప్రాంతం వారిని కేటాయిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *