mt_logo

ఎల్ఆర్ఎస్ కు అక్టోబర్ 15 వరకు గడువు..

ఆగస్ట్ 26 వరకు రిజిస్ట్రేషన్ అయిన అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినందున ఆ దిశగా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి ఎల్ఆర్ఎస్, హరితహారంపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ కు అక్టోబర్ 15 వరకు అవకాశం ఉందని, జిల్లాలోని 560 గ్రామ పంచాయితీల పరిధిలోని అక్రమ లే అవుట్ల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు.

ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని, రెగ్యులరైజ్ చేసుకోకపోతే విద్యుత్, నీటి కనెక్షన్లతో పాటు ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు కల్పించడం జరగదని పేర్కొన్నారు. అదే విధంగా పల్లె ప్రకృతి వనం కింద 560 గ్రామ పంచాయితీలకు గాను 518 చోట్ల భూములను గుర్తించామని, ఇప్పటివరకు 398 గ్రామ పంచాయితీల్లో మొక్కలు నాటారని, మిగిలిన చోట్ల వెంటనే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. కందుకూరు, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం డివిజన్లలోని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు పెద్దమొత్తంలో నాటారని, షాద్ నగర్ డివిజన్ లో ఈ సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీవో ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *