రోజురోజుకి విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. నగరంలో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్ఆర్డీపీతో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోనే అందుబాటులోకి తీసుకు రానున్నట్లు సోమవారం అధికారులు తెలిపారు. దీంతో ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వరకు అక్కడి నుంచి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించవచ్చు.
నాగోల్ ఫ్లై ఓవర్ భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్కు రూ.143.58 కోట్ల వ్యయం కాగా రూ. 69కోట్ల వ్యయంతో 990 మీటర్ల ఫ్లై ఓవర్ కారిడార్ను చేపట్టారు. 200 ఫీట్ల వెడల్పుతో మాస్టర్ ప్లాన్ను ప్రతిపాదించారు. రెండు మార్గాలు కలిగిన ఫ్లై ఓవర్ 24 మీటర్ల వెడల్పు 6 లైన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వే చేపట్టారు. 23 పిల్లర్స్, 22 స్పాన్స్తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్, 300 మీటర్ల అప్రోచ్ పొడవుతో ఆర్ఈ వాల్ చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ వలన ఎల్బీనగర్ నుంచి ట్రాఫిక్కు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.