రామగుండం ఎఫ్సీఐ పునరుద్ధరణ పనులపై ఎంపీ బాల్క సుమన్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలోని పరిశ్రమలను మూసివేశారని, అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రామగుండం ఎరువుల కర్మాగారమేనని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రులను కలిసి గ్యాస్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ స్పష్టం చేశారు.