Mission Telangana

నా పేరు ఎక్కడా లేదు… అందుబాటులో ఉండలేను : సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌ను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను చూశాను. దాంట్లో నా పేరు ఎక్కడా లేదు’ అని తెలిపారు. ఈ కేసులో వివరణ కోసమే సీబీఐ ఇచ్చిన నోటీసులపై కవిత ప్రతిస్పందిస్తూ.. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు.

దాంతో తాను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారికి లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాలతో ఈ నెల 6వ తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పారు. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *