యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా హారికను కలిసిన ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తాను ఎంబీబీఎస్లో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కాగా, కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకు హారికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వాగానికి లోనయ్యారు. తాను బాగాచదువుకొని తనవంతుగా సమాజానికి తోడ్పాటునoదిస్తానని హారిక అన్నారు.
