ఒకవైపు రోజురోజుకి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నెత్తిన భారాన్ని మోపుతున్నారు, మరోవైపు ఆయిల్ కంపెనీలకు ప్యాకేజీలు ఇస్తూ, వారికి మాత్రం కాసులు ఎత్తి పోస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. సామాన్యుల ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘పేద, మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తరు.. కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా..? రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 (NOT-OUT). ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయిల్ కంపెనీలకు కాదు. ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇవ్వాలి స్పెషల్ ప్యాకేజీలు’’ అన్నారు.
‘‘సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి, ఇప్పుడు మూడు సిలిండర్ల జపం చేస్తారా? మూడు సిలిండర్లతో మూడు పూటలా వంట సాధ్యమా..? ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం..!! ఆడబిడ్డలపై ఆర్థిక భారమా..? ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా..? గరీబోల్ల గుండెలపై మోయలేని గుదిబండలు.. ఈ గ్యాస్ బండలు. మహిళా లోకానికి అర్థమైంది, మోయలేని భారం మోపే వాడే, మోడీ.’’ అని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రధానిని తూర్పార బట్టారు.