mt_logo

చంద్రబాబు శనిలా పట్టుకున్నాడు!- జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు శనిలా పట్టుకున్నాడని విద్యుత్ శాఖామంత్రి జీ జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీలో కలుపుకోవడం కోసం చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుకున్నాడని విమర్శించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామోననే భయంతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా మారుతుందని చెప్పారు.

అంతకుముందు జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేని లోటు పూడ్చలేనిదని, సార్ కలలు కన్న తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, యాచించే తెలంగాణ కాదు, శాసించే తెలంగాణ కావాలన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వప్నం నెరవేరిందని, జయశంకర్ సార్ కలలుగన్న బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *