నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తి దగ్గర ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, గతంలో సమైక్య పాలకులు పుష్కరాలను నిర్లక్ష్యం చేశారని, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలను కనీవినీ ఎరుగని విధంగా జరుపుకుంటామని చెప్పారు. ఈసారి పుష్కరాలకు సుమారు 8 కోట్లమంది వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు.
జూన్ 15లోగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పుష్కర పనులను పూర్తి చేస్తామని, పుష్కర పనుల కోసం కలెక్టర్లు కోరితే మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, ప్రజల ఆదరాభిమానాలముందు ప్రతిపక్షాల విమర్శలు నిలవవని ఇంద్రకరణ్ రెడ్డి తేల్చిచెప్పారు.