mt_logo

ప్రకృతి వైద్యంపై ప్రజల్లో ఆసక్తి : మంత్రి హ‌రీశ్‌రావు

దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన ప్రకృతి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిట‌ల్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సౌక‌ర్యాలు, స‌దుపాయాలు, వ‌స‌తులు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం నేచురోప‌తి వైద్యంపై నిర్వ‌హించిన‌ సమీక్షలో మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ… ప్రజల్లో నేచురోపతి (ప్రకృతి ) వైద్యంపై పెరుగుతున్న‌ ఆసక్తికి అనుగుణంగా నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ప్రకృతి వైద్యంలో ప్రసిద్ధి పొందిన మంథని సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో నేచురోపతి ఓపీ, ఐపీ సేవలను మ‌రింత మెరుగుప‌రిచి, అందుకు అనుగుణంగా ప్ర‌త్యేక విభాగాల‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్రకృతి వైద్యం కాబట్టి హాస్పిట‌ల్‌లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని మంత్రి సూచించారు. అదేవిధంగా నేచురోపతికి ప్రత్యేక భోజ‌న డైట్ ఉంటుంది కాబట్టి వాటికి కావాల్సిన వంట గది, సామాగ్రి సమకూర్చాలన్నారు. రోగులకు సేవలు అందించేందుకు సరిపడా వైద్యుల‌ను, సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, ప్రకృతి వైద్య నిపుణులు మంథని సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *