BY: కట్టా శేఖర్రెడ్డి
తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో అత్యధికులు క్లీన్ ఇమేజి ఉన్నవారు. దీక్షాదక్షతల్లో ఎవరికీ తీసిపోనివారు. తెలంగాణకు ఏదో ఒకటి చేయాలన్న తపన, అంకితభావం ఉండడం అదనంగా కలసి వచ్చే అంశం. ఇప్పుడు మన విధానాలు, మన ప్రణాళికలు, మన కార్యాచరణ మన చేతుల్లోనే ఉన్నాయి. నాయకత్వమూ, అధికార యంత్రాంగమూ కొత్త పరిస్థితులకు ట్యూన్ కావలసి ఉంది. ఆలోచనలు ఎన్ని చేసినా దానికి అంతిమ పరీక్ష
అవి సాధించే ఫలితాలే.
స్వయంపాలనలో మన నాయకత్వం మనలను పరిపాలించడం ఎంత ముఖ్యమో, మన అధికారులు మన కార్యనిర్వాహకులు కావడం అంతే ముఖ్యం. నాయకత్వం ఎంత గొప్ప ఆలోచనలు చేసినా ఆచరణలో పెట్టే యంత్రాంగం చిత్తశుద్ధితో, నిజాయితీతో వ్యవహరించకపోతే అవి సత్ఫలితాలు సాధించలేవు. మనది అన్న ఆలోచన లేకపోతే ఏ నాయకుడు, ఏ అధికారి మనసు పెట్టి పనిచేయలేడు. సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో నాయకత్వ పాత్ర ఎంత ఉందో అధికారుల పాత్ర కూడా అంతే ఉంది. నాయకుడు, అధికారి కలిస్తేనే ఎస్టాబ్లిష్మెంట్. సీమాంధ్ర ఎస్టాబ్లిష్మెంట్ పర్ఫెక్ట్ కాంబినేషన్తో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ వచ్చింది. ఫైళ్లు కదలవు. జీవోలు అమలు కావు.
ఏళ్ల తరబడి ఏ ప్రాజెక్టూ పూర్తి కాదు. ఒకేసారి మొదలు పెట్టిన శ్రీశైలం కుడిగట్టుకాలువ పూర్తవుతుంది, శ్రీశైలం ఎడమగట్టుకాలువ అనేక రూపాంతరాలు చెంది ఇప్పటికీ కుంటి నడకలు నడుస్తూ ఉంటుంది. ఇచ్చంపల్లి గురించి మాట్లాడేవారుండరు, పోలవరం, పులిచింతల ఎంత ప్రాధాన్యమైనవో నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రాణహిత- చేవెళ్ల గురించి చాలా పెద్దగా మొదలయిన ఆలోచనలు చివరికి కుదించుకుపోతాయి. 160 టీఎంసీలతో తలపెట్టిన ప్రాజెక్టు నివేదిక, చివరకు 60 టీఎంసీల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. పదకొండు వేల క్యూసెక్కుల కాలువ నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యానికి కుంచించుకుపోతుంది. ఇష్టమయితే అదే పదకొండు వేల క్యూసెక్కుల కాలువ ఏ అనుమతులు, అధికారాలు లేకున్నా 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెరుగుతుంది. తెలంగాణలో ఉన్న అక్రమ ఉద్యోగులను పంపించాలంటే ఏళ్లు పడుతుంది. అదే ఆంధ్రాలో ఉన్న ఉద్యోగులను పంపడానికి ఆగమేఘాలపై ఆదేశాలు వస్తాయి. 610 జీవో అమలులో తెలంగాణకు ఎదురయిన చేదు అనుభవాలు చాలు ఎస్టాబ్లిష్మెంట్ చేసిన దుర్మార్గాలను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆఖరి ఛత్రము కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది.
ఎన్నికల ద్వారా మన అసెంబ్లీ ఏర్పడింది. ఇప్పుడు అధికారుల విభజన ద్వారా మన సచివాలయం కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోబోతున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇది కూడా ఒక కీలకమైన పరిణామం. ఏ అధికారి ఏ రాష్ట్రానికి వెళ్లాలో నిర్ణయం అయిపోయింది. అధికారులు ఆయా ప్రభుత్వాల్లో చేరడమే మిగిలి ఉంది. రాష్ట్రం ఏర్పడి రెండున్నర మాసాలవుతున్నా అధికారులు లేకపోవడం వల్ల సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలు కాలేదు. చాలా శాఖలకు కార్యదర్శులు లేరు. తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించిన అధికారులే ఒక్కొక్కరు నాలుగైదు శాఖలు చూడవలసి వస్తున్నది.
అధికారులు ఏం చేస్తారని చాలా మంది అంటుంటారు. నాయకులు చూసి రమ్మంటే అధికారులు కాల్చివస్తారు. యాభై ఆరేళ్ల తెలంగాణ ప్రస్థానంలోనూ, పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలోనూ ఇటువంటి అనుభవాలు కొల్లలు. తెలంగాణ నాయకులు మంత్రులుగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. హోంమంత్రిగా మన మాధవరెడ్డిని చూశాం. సబితమ్మను చూశాం. వాళ్లు ఏం చేయగలిగారో, ఏం చేయలేకపోయారో చూశాం. శ్రీశైలం ఎడమ కాలువ పనులు మొదలు పెట్టించడానికి మాధవరెడ్డి తన మంత్రిపదవికి రాజీనామా చేసి, ప్రచ్ఛన్న యుద్ధానికి దిగవలసి వచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రులుగా కడియం శ్రీహరిని చూశాం. పొన్నాల లక్ష్మయ్యను చూశాం. వారి పరిమితులూ మనకు తెలిసినవే. ఎస్టాబ్లిష్మెంట్ అంతా సీమాంధ్రదే ఉన్నప్పుడు ఏ మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి కోరుకున్నదీ, ఆయన ఎంచుకున్న యంత్రాంగం చెప్పిందే జరుగుతూ వచ్చింది. చెన్నారెడ్డి కూడా పదవిలో ఉన్నన్ని రోజులు డెల్టా ఆధునీకరణకు ప్రపంచ బ్యాంకు రుణం సంపాదించడం ఎలాగో తపిస్తూ వచ్చారు.
మా గురువు వడ్డెర చండీదాస్ చెబుతుండేవారు. అధికారం గరిమనాభి కృష్ణా-గుంటూరు -గోదావరి జిల్లాల్లో ఉంటుందని. ఎవరయినా వారిని మెప్పును పొందినంతకాలమే అధికారంలో ఉంటారని. ఆ గరిమనాభి బలం ఒక్క రాజకీయమే కాదు, అధికారులు కూడా. తెలంగాణకు ఇప్పుడా గరిమనాభి పీడ వదలిపోయింది.
శనివారం ఉదయమే ఒక మిత్రుడు ఫోను చేశాడు. సీమాంధ్ర ఆధిపత్య అధికార యంత్రాంగం పీడా వదిలిపోయినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఆయన కొన్ని పేర్లు చదువుతూ వారితో తనకు ఉన్న చేదు అనుభవాలను వివరిస్తూ పోయాడు. దీక్ష చేస్తున్న మన కేసీఆర్ను పోలీసు వ్యానులోకి విసిరేసిన వాడు, ఉస్మానియాలో మన విద్యార్థులపై, జర్నలిస్టులపై దాష్టీకం చేసినవారు, సమైక్యాంధ్ర సభలను దగ్గరుండి నడిపించినవాడు, అత్యంత అభివృద్ధి నిరోధక భావజాలంతో అన్ని ఉద్యమాలపై విషంగక్కినవారు, సచివాలయం సాక్షిగా తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలకు కేంద్ర బిందువుగా పనిచేసినవారు, తెలంగాణ ఉద్యమకారుల టెలిఫోన్లు ట్యాప్చేసి దొంగచెవులతో విన్నవారు …. ఒక్కరేమిటి….ఇలా చాలా మంది అధికారులను గురించి ఆయన ఉద్వేగంతో చెప్పుకుపోతున్నారు.
ఇది ఆయన ఒక్కరి భావన కాకపోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లక్షలాది మంది ఉద్యమకారుల అంతరంగం కూడా ఇలాగే ఉండిఉండవచ్చు. సీమాంధ్ర అధికారులు తెలంగాణవాదులపట్ల వ్యవహరించిన తీరు గురించి చిన్న చిన్న ఉద్యోగులు చెబుతున్న కథలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలిండియా సర్వీసెస్ అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలన్నది ఆదర్శం. కానీ వాళ్లంత సంకుచితులు లేరని, వాళ్లు చూపించినంత వివక్ష చివరికి రాజకీయ నాయకులు కూడా చూపించలేదని కొందరు కిందిస్థాయి పోలీసు ఉద్యోగుల అనుభవాలు వింటే అర్థమవుతోంది. కొంతమంది ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా కూడా చాలా అథమాథమస్థాయి మనుషులని కూడా తెలంగాణ పోలీసు ఉద్యోగులు చెబుతున్నారు. వాళ్లు ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలాయించుకున్నారని కూడా చెబుతున్నారు. మరి కొన్నాళ్లు సమిష్టిగా కొనసాగాల్సిన విభాగాల్లో ఇంకా ఈ దుర్మార్గాలు, ఈ వివక్షలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని కూడా ఉద్యోగులు చెబుతున్నారు. అయితే వాళ్లు ఉంటున్నది హైదరాబాద్లో అన్న ఒక్క అంశమే మాకు కొంత ధైర్యాన్నిస్తున్నది అని ఒక చిరుద్యోగి గర్వంగా చెప్పాడు.
అక్కడక్కడా ఇటువంటి బాధలు తప్ప అధికార యంత్రాంగం అంతా స్వేచ్ఛను పొందింది. తెలంగాణ కోసం తపించి, శ్వాసించి, ఉద్యమకారులతోపాటు చలించిపోయిన తెలంగాణ అధికారులంతా తెలంగాణకు రావడం సంతోషించదగిన పరిణామం. తెలంగాణకు కేటాయించిన అధికారుల్లో అత్యధికులు క్లీన్ ఇమేజి ఉన్నవారు. దీక్షాదక్షతల్లో ఎవరికీ తీసిపోనివారు. తెలంగాణకు ఏదో ఒకటి చేయాలన్న తపన, అంకితభావం ఉండడం అదనంగా కలసివచ్చే అంశం.
ఇప్పుడు మన విధానాలు, మన ప్రణాళికలు, మన కార్యాచరణ మన చేతుల్లోనే ఉన్నాయి. నాయకత్వమూ, అధికారయంత్రాంగమూ కొత్త పరిస్థితులకు ట్యూన్ కావలసి ఉంది. ఆలోచనలు ఎన్ని చేసినా దానికి అంతిమ పరీక్ష అవి సాధించే ఫలితాలే. ఆ ఫలితాలు కూడా ఎంత తొందరగా సాధిస్తామన్నదే ముఖ్యం. ఇప్పుడొక అద్భుత పథకం రూపొందించే నాలుగేండ్ల దాకా వేచి చూసే పరిస్థితి తలెత్తితే జనం విసుగెత్తిపోతారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐదేళ్లకు సరిపోను అభివృద్ధి ఎజెండాను జనం ముందు పెట్టింది. వాటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి అధికార యంత్రాంగం అంతే వేగంగా పనిచేయవలసిన అవసరం ఉంది.
Courtesy: నమస్తే తెలంగాణ