mt_logo

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయం ప్రధాన ద్వారం!

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇకపై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రూపుదిద్దుకోనుంది. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రధాన ద్వారానికి అనుమతులు వచ్చినప్పటికీ కాకతీయ కళాతోరణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి అనుమతులు రాగానే ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. నవాబుల పాలన, కాకతీయుల రాజసం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ఈ ప్రధాన ద్వారం కోసం రూ. 40 లక్షలను కేటాయించారు.

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర స్ఫురించేలా నిర్మిస్తున్న ప్రధాన ద్వారాన్ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్ట్ శైలిలో నిర్మించనున్నారు. కళాతోరణాన్ని కాకతీయుల నిర్మాణశైలికి అనుగుణంగా నిర్మించనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ తో పాటు తెలంగాణ షాన్ గా పేరుపొందిన చారిత్రక కట్టడాలను పోలి ఉండేలా నిర్మాణం పైభాగం టూంబ్స్ తో ఏర్పాటు చేయనున్నారు. సెక్యూరిటీ రూమ్ పేరుతో నిర్మిస్తున్న ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆరు గేట్లు నిర్మిస్తారు. పాదచారులతో పాటు, అధికారిక, అనధికారిక వాహనాలు, ద్విచక్ర వాహనాల కోసం ఇన్, అవుట్ గేట్లు ఉంటాయి. ప్రధాన ద్వారం తర్వాత కొద్దిదూరంలో కాకతీయ కళాతోరణం ఉంటుంది. దీని మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *