mt_logo

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం..

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులు విచ్చేసి మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. లక్షలమంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు రాగా వీధులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. బోనాల సంస్కృతి తెలిపే జానపద గేయాలతో లష్కర్ వీధులన్నీ మార్మోగిపోయాయి. కత్తులు, బల్లెం చేతపట్టి పోతరాజులు, డప్పు దరువులు, తప్పెటమోతకు చిందులేస్తూ శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆకుపచ్చ తోరణాలు, విద్యుద్దీప కాంతులతో ఆలయం చుట్టూ అలంకరించారు. రాష్ట్రప్రభుత్వం తరపున వాణిజ్యపన్నుల శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు, వడిబియ్యం సమర్పించారు.

డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి బోనమెత్తుకుని వచ్చి మహంకాళి అమ్మవారికి సాకపోసి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ దంపతులకు రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్రమంత్రులు ఎం వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు నాయిని, జగదీష్ రెడ్డి, ఈటెల, తుమ్మల నాగేశ్వరరావు, టీ పద్మారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బూరనర్సయ్య గౌడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఏనుగు రవీందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్, బీజేపీ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బోనాలకు హాజరైనవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *