mt_logo

కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ రావాలంటే లోక్‌సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలి: కేటీఆర్

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బలపరిచారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నిక్కార్సైన ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్.. ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ గారి పాత్ర ముఖ్యమైనది అని కొనియాడారు.

2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం.. తెలంగాణ రాష్ట్రం కోసం తన గళాన్ని బలంగా వినిపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం అత్యధిక చర్చల్లో పాల్గొన్నారు.. పార్లమెంట్‌లో 500 పైచిలుకు ప్రశ్నలు సంధించి.. దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో రెండో స్థానంలో నిలిచారు అని గుర్తు చేశారు.

కరీంనగర్‌ పట్టణం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక అవ్వడంలో, జాతీయ రహదారులు, రైల్వే లైన్ రావడంలో కీలకపాత్ర పోషించారు. విద్యుత్, సాగునీరు, హైకోర్టు, 95% స్థానిక రిజర్వేషన్లు ఇలా తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై పార్లమెంట్‌లో, ఢిల్లీలో వినోద్ కుమార్ అలుపెరగని పోరాటం చేశారు అని కేటీఆర్ తెలిపారు.

కొన్నేళ్లగా కలగానే మిగిలిపోయిన ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలు కరీంనగర్‌కి రావాలంటే లోక్‌సభలో వినోద్ కుమార్ గొంతు వినిపించాలి అని అన్నారు. వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం.. కారు గుర్తుకే ఓటేసి.. వినోద్ కుమార్‌ని గెలిపించాలని పిలుపునిచ్చారు.